Gangotri Temple Decision: ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రాల(Uttarakhand Temples) సాంస్కృతిక, మతపరమైన సంప్రదాయాలను కాపాడే దిశగా ఆలయ కమిటీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ‘దేవభూమి’గా ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లోకి అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధించే చర్యలు ప్రారంభమయ్యాయి.
గంగోత్రి ఆలయ కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో అన్యమతస్థుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నిబంధనలు గంగోత్రి ధామ్తో పాటు శీతాకాలంలో గంగామాత కొలువై ఉండే ముఖ్బా ప్రాంతానికీ వర్తిస్తాయని కమిటీ అధ్యక్షుడు సురేష్ సెమ్వాల్ వెల్లడించారు.
ఇదే దారిలో శ్రీ బద్రీనాథ్–కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC) కూడా ముందుకెళ్తోంది. తమ పరిధిలోని 45 ఆలయాల్లో అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధించేందుకు రానున్న బోర్డు సమావేశంలో అధికారిక ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నట్లు BKTC అధ్యక్షుడు హేమంత్ ద్వివేది తెలిపారు. దేవభూమి ఉత్తరాఖండ్లో శతాబ్దాల నాటి సంప్రదాయాలను పరిరక్షించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, హరిద్వార్లోని హర్ కీ పౌడీ ఘాట్ వద్ద ‘అన్యమతస్థులకు ప్రవేశం లేదు’ అనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ చర్యలపై విపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఆరోపించింది.
also read:RBI Recruitment 2026 | ఆర్బీఐలో భారీ నోటిఫికేషన్.. 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు
