Steel Bridge Stolen: రాత్రికి రాత్రే 10 టన్నుల బరువైన స్టీల్ వంతెన చోరీకి గురైన ఘటన ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో కలకలం రేపింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కోర్బా నగరంలోని ధోధిపారా ప్రాంతంలో హస్డియో ఎడమ కాలువపై సుమారు 40 ఏళ్ల క్రితం 70 అడుగుల పొడవైన ఉక్కు వంతెనను నిర్మించారు. ఈ వంతెన బరువు 10 టన్నులకు పైగానే ఉంటుంది.
జనవరి 18న ఉదయం కాలువపై వంతెన కనిపించకపోవడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ముందు రోజు రాత్రి వరకు ఉన్న వంతెన తెల్లవారేసరికి మాయమవడంతో ఈ విషయాన్ని కార్పొరేటర్ లక్ష్మణ్ శ్రీవాస్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక విచారణలో జనవరి 17 రాత్రి గుర్తుతెలియని 15 మంది దుండగులు గ్యాస్ కట్టర్లతో స్టీల్ రెయిలింగ్లను కట్ చేసి, స్క్రాప్గా విక్రయించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారి సమాచారంతో కాలువలో దాచిన సుమారు ఏడు టన్నుల ఉక్కును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
స్టీల్ వంతెన చోరీ ఘటన అనంతరం స్థానికులు సమీపంలోని కాంక్రీట్ వంతెనను ఉపయోగించి కాలువను దాటుతున్నారని అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
also read:Mobile App Safety: మీ ఫోన్లో ఈ యాప్లు ఉన్నాయా? అయితే డేటా ప్రమాదంలో ఉన్నట్టే!
