తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభమైన నేపథ్యంలో టీటీడీ అధికారులు సుప్రభాత సేవలను రద్దు చేశారు. రేపటి నుంచి జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవలు నిలిపివేస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధనుర్మాసం ఘడియలు ఈరోజు ఉదయం 6.57 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యేక మాసంలో తిరుప్పావై నివేదనతో శ్రీవారి మేల్కొలుపు నిర్వహించనున్నారు.
ధనుర్మాసం సందర్భంలో నెల రోజుల పాటు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుప్పావై పఠనం నిర్వహిస్తారు. శ్రీవారి మేల్కొలుపు కార్యక్రమం సుప్రభాత సేవ స్థానంలో కొనసాగుతుంది. అంతేకాకుండా శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంత సేవ కూడా నెల రోజుల పాటు జరుగుతుంది.
జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఈ కాలంలో భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది.
ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. నిన్న 66,160 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 3.47 కోట్లను భక్తులు స్వామి వారికి సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు.