Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపడంతో సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య బారిన పడిన ఢిల్లీ ప్రజలకు ఊపిరి అందించేలా తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) చేసిన సూచనలను ఎలా అమలు చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు వచ్చే నాలుగు వారాల్లో పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో పాటు జస్టిస్ జయ్మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్ను విచారించింది.
also read:70 Years Old UP Man First Vlog Goes Viral: తొలి వీడియోతోనే సంచలనం సృష్టించిన 70 ఏళ్ల తాత
ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత రోజురోజుకూ మరింత దిగజారుతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణ విషయంలో ఇకపై ఎలాంటి ఆలస్యాలు, సాకులు సహించబోమని స్పష్టంగా హెచ్చరించింది.
ఈ సందర్భంగా సీఏక్యూఎం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. ఢిల్లీలో కాలుష్య స్థాయిలను తగ్గించేందుకు సీఏక్యూఎం మొత్తం 15 దీర్ఘకాలిక చర్యలను సూచించిందని తెలిపారు.
తాత్కాలిక చర్యలతో సమస్య పరిష్కారం కాదని, దీర్ఘకాలిక వ్యూహమే అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది.
అధికంగా కాలుష్యం వెదజల్లే వాహనాలను దశలవారీగా తొలగించడం, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) వ్యవస్థను కఠినంగా అమలు చేయడం, మెట్రో, రైలు రవాణా విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని సవరించి వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలను అమలు చేయాలని సీఏక్యూఎం సిఫార్సు చేసింది.
