Modi Israel Visit: భారత ప్రధాని “నరేంద్ర మోదీ” వచ్చే వారం ఇజ్రాయెల్కు అధికారిక పర్యటన చేయనున్నట్లు సమాచారం. రక్షణ, ఉగ్రవాద నిరోధక చర్యలు, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత వంటి కీలక రంగాల్లో భారత్–ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు.
మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయెల్కు వెళ్లడం ఇదే తొలిసారి కాగా, 2017 తర్వాత ఆ దేశాన్ని సందర్శించడం విశేషం.
ఇజ్రాయెల్ ప్రధాని “బెంజమిన్ నెతన్యాహు” ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఈ పర్యటన జరిగే అవకాశముందని సమాచారం. ఇటీవల అమెరికన్ జ్యూయిష్ సంస్థల అధ్యక్షుల సమావేశంలో నెతన్యాహు ఈ పర్యటనను ప్రస్తావిస్తూ భారత్–ఇజ్రాయెల్ మధ్య బలమైన స్నేహ బంధాన్ని గుర్తు చేశారు. 140 కోట్ల జనాభాతో భారత్ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ పర్యటనలో రక్షణ రంగ సహకారం, ఉగ్రవాదంపై కఠిన చర్యలు, సైబర్ భద్రత, క్వాంటం పరిశోధనలు, ఆధునిక వ్యవసాయం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ పర్యటన భారత్–ఇజ్రాయెల్ సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
