Nitish Kumar: బీహార్ మహిళలకు మరోసారి ఆర్థిక భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రినితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శివరాత్రి కానుకగా రాష్ట్రంలోని అర్హత ఉన్న మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జమ చేశారు. అకస్మాత్తుగా ఖాతాల్లో డబ్బులు పడడంతో నారీమణులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది నవంబర్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయడం రాజకీయంగా కీలకంగా మారింది. ఆ నిర్ణయంతో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని అధికార కూటమికి మద్దతు తెలిపారు. ఫలితంగా నితీష్ కుమార్ నేతృత్వంలోని కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించి ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది.
అదే వ్యూహాన్ని కొనసాగిస్తూ, మరోసారి మహిళల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడం ద్వారా ప్రభుత్వం తన సంక్షేమ అజెండాను బలపరుస్తోంది. శివరాత్రి పర్వదినంలో ఈ ఆర్థిక సహాయం అందడంతో మహిళల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. మహిళల సాధికారతే లక్ష్యంగా ఈ పథకం కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.








