మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గోదావరి నదీ తీరంలో ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. రావులపాలెం ప్రాంతానికి చెందిన డొక్కా సీతమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో ఈ మహాదాన కార్యక్రమాన్ని నిర్వహించగా, వేలాదిమంది భక్తులు హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు.
డొక్కా సీతమ్మ సేవాసమితి సభ్యులు మాట్లాడుతూ, మూడు సంవత్సరాల క్రితం రావులపాలెంలో మిత్రులంతా కలిసి ఏర్పాటుచేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా విరాళాలు సేకరించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆర్థికంగా నిస్సహాయులైన వారికి సహాయం చేయడంతో పాటు, ప్రతి పవిత్ర దినోత్సవం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు. నదీ తీరంలో భక్తులు శివనామస్మరణతో భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సేవా సమితి సభ్యులు, భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టి, సమర్థంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ మహాదాన కార్యక్రమంలో డొక్కా సీతమ్మ సేవాసమితి ఫౌండర్ పిల్లా శ్రీదేవి, నిర్వాహకులు వల్లెం రాజేష్, తోగరు ఉదయ్, కోరే తేజ సాయి, కానుబోను తేజమనికంట, పడాల పద్మ, పిల్లా శేషా రత్నం, చిలువూరి లక్ష్మి, బృందావనం లక్ష్మి, వల్లెం రజిని తదితరులు పాల్గొన్నారు. భక్తుల సేవే మాకు ధ్యేయమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని సమితి సభ్యులు తెలిపారు.
