Ditwa cyclone rain alert: దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక సమాచారం విడుదల చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తర తమిళనాడు – పుదుచ్చేరి తీరాలలో నిన్నటి వరకు కొనసాగిన వాయు గుండం, డిసెంబర్ 3 ఉదయం బాగా గుర్తించబడిన అల్పపీడనంగా అదే ప్రాంతంలో కొనసాగుతోంది.
ఈ వ్యవస్థ సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి రానున్న వచ్చే 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ALSO READ:CM Revanth Reddy meets PM Modi | తెలంగాణ అభివృద్ధికి సహాయం కోరిన రేవంత్
దీనికి అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతాల్లో బుధవారం నుంచి శుక్రవారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ విభాగం హెచ్చరించింది.
ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో అనేక చోట్ల వర్షాలు నమోదవుతాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో కూడా ఇదే తరహా పరిస్థితులు ఉండవచ్చని అంచనా వేసింది.
ఈదురు గాలులు గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో కూడా ఈరోజు కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే గురువారం, శుక్రవారం రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
