జస్ట్ 28 నిమిషాల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకుంటే ఎలా ఉంటుంది? రైలు ప్రయాణమా లేక రాకెట్ ప్రయాణమా అన్నట్లుగా చైనా మరో సాంకేతిక విప్లవానికి సిద్ధమవుతోంది. శబ్ద వేగాన్ని మించి గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సూపర్సోనిక్ రైలును చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.
ఈ టెక్నాలజీ అమలులోకి వస్తే 700 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చు.
ఇప్పటికే గంటకు 501 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తే మాగ్లెవ్ రైళ్లతో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన చైనా, ఇప్పుడు శబ్ద వేగాన్ని ఛేదించే రైళ్లపై దృష్టి పెట్టింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నారు.
‘ఎలక్ట్రోమాగ్నెటిక్ స్లెడ్జ్’ టెక్నాలజీతో వాహనాన్ని గాలిలో తేలేలా చేసి అతి వేగంతో ముందుకు నడిపే విధానం ఇందులో ఉపయోగిస్తున్నారు. 2023లో జరిగిన పరీక్షల్లో ఒక టన్ను బరువున్న వాహనాన్ని మాక్–1 వేగంతో పంపించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
అయితే, సూపర్సోనిక్ వేగంలో షాక్ వేవ్స్ ప్రధాన సవాల్గా మారుతున్నాయి. దీనిని అధిగమించేందుకు విద్యుత్ సరఫరాలో వచ్చే మార్పులను విశ్లేషించి వేగాన్ని గుర్తించే వినూత్న వ్యవస్థను అభివృద్ధి చేశారు. జు ఫీ బృందం రూపొందించిన ఈ అల్గోరిథం 98.9 శాతం ఖచ్చితత్వంతో పని చేస్తోంది.
ఈ రైలు భారత్లో నడిస్తే హైదరాబాద్–విజాగ్ ప్రయాణం కేవలం 28 నిమిషాలకే పరిమితమవుతుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో భూమిపై ప్రయాణం అంతరిక్ష ప్రయాణంలా వేగంగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు.
ALSO READ:Supreme Court stay on UGC Rules | యూజీసీ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే
