Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. అమెరికాలో జనవరి నెల జాబ్స్ డేటా అంచనాలకు మించి రావడం గ్లోబల్ సెంటిమెంట్ను దెబ్బతీసింది.
దీంతో ఫెడ్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు తగ్గాయని భావించిన మదుపర్లు జాగ్రత్త పడ్డారు. ఫలితంగా ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి.
ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి ప్రధాన ఐటీ షేర్లు తీవ్రంగా పతనమయ్యాయి. నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 5 శాతం క్షీణించింది. ఏఐ పోటీ భయాలు, గరిష్ఠ స్థాయిల వద్ద లాభాల స్వీకరణ కూడా ప్రభావం చూపాయి. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ సుమారు ₹3 లక్షల కోట్లు తగ్గింది.
సెన్సెక్స్ 558 పాయింట్లు కోల్పోయి 83,674 వద్ద ముగిసింది. నిఫ్టీ 146 పాయింట్లు పడిపోయి 25,807 వద్ద నిలిచింది. రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 90.61 వద్ద ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర 69 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం 5064 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
