AI Tools Impact: ప్రపంచాన్ని ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శాసిస్తున్నదనే చెప్పాలి. ఏఐ టూల్స్ వేగంగా విస్తరిస్తుండటంతో అనేక రంగాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో లేఆఫ్లు కొనసాగుతుండటంతో ఉద్యోగ భద్రతపై ఐటీ నిపుణులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఏఐ వల్ల సాఫ్ట్వేర్ రంగానికి భారీ దెబ్బ పడుతుందన్న ప్రచారానికి గూగుల్, ఎన్విడియా, ఆంథ్రోపిక్ వంటి దిగ్గజ సంస్థల అధినేతలు స్పష్టత ఇచ్చారు.
ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గవని, నిజానికి మరింత అవకాశాలు పెరుగుతాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) భరోసా ఇచ్చారు. ఏఐ సహాయంతో ఉత్పాదకత పెరుగుతుందని, ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం తగ్గి, కొత్త ఆవిష్కరణలకు దారి తెరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం గూగుల్లో సుమారు 30 శాతం కోడ్ను ఏఐ ద్వారానే రూపొందిస్తున్నామని తెలిపారు.
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హాంగ్ కూడా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ముప్పు కాదని స్పష్టం చేశారు. ఏఐ పూర్తిగా మనుషుల చేత రూపొందించిన సాఫ్ట్వేర్పై ఆధారపడుతుందని, కొత్తగా స్వతంత్రంగా ఏదైనా సృష్టించలేదని వివరించారు.
ఇక ఆంథ్రోపిక్(Anthropic) సంస్థ సహ వ్యవస్థాపకురాలు డేనియల అమోడెయ్ మాట్లాడుతూ, ఏఐ వల్ల కోడింగ్ ప్రాధాన్యం కొంత తగ్గవచ్చేమోగానీ ఉద్యోగాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.
భవిష్యత్తులో కమ్యూనికేషన్ స్కిల్స్, సృజనాత్మకత, నేర్చుకునే తపన, భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆమె తెలిపారు. మొత్తం మీద ఏఐ భయం కాదు, కొత్త అవకాశాలకు ద్వారం అని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.
