Income Tax Rules 2026: కేంద్ర ప్రభుత్వం “ఫిబ్రవరి 7న డ్రాఫ్ట్ ఆదాయపు పన్ను నిబంధనలు–2026” ను విడుదల చేసింది. ఈ డ్రాఫ్ట్లో పాన్ (PAN Card) తప్పనిసరి అయ్యే లావాదేవీలపై ఉన్న ఆర్థిక పరిమితులను భారీగా పెంచాలని ప్రతిపాదించింది.
కొత్త నిబంధనల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతాల్లో “నగదు జమలు లేదా ఉపసంహరణలు కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువైతేనే పాన్ తప్పనిసరి” అవుతుంది. ఇప్పటివరకు ఒకే రోజులో రూ.50 వేలకుపైగా నగదు లావాదేవీ జరిగితే పాన్ ఇవ్వాల్సి ఉండేది.
మోటారు వాహనాల కొనుగోలులో కూడా కీలక మార్పులు చేశారు. గతంలో రూ.5 లక్షలకు పైగా విలువైన వాహనాలకు మాత్రమే పాన్ అవసరం కాగా, ఇకపై “వాహనం ధర ఎంతైనా సరే పాన్ తప్పనిసరి” చేయనున్నారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ సేవల కోసం చేసే చెల్లింపుల్లో “బిల్ మొత్తం రూ.1 లక్ష దాటితేనే పాన్ అవసరం” అవుతుంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.50 వేలుగా ఉంది.
స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం, బహుమతి లేదా జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాల్లో పాన్ పరిమితిని “రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు”. అలాగే బీమా కంపెనీలతో ఖాతా ఆధారిత సంబంధం ప్రారంభించినప్పుడూ పాన్ తప్పనిసరి అవుతుంది.
క్రిప్టో ఎక్స్చేంజీలు ఆదాయపు పన్ను శాఖకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలన్న నిబంధనను డ్రాఫ్ట్లో చేర్చారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)ను అధికారిక ఎలక్ట్రానిక్ చెల్లింపుల రూపంగా గుర్తించారు. ఈ కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు “2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి” రానున్నాయి.








