Bird Flu Alert: చెన్నై నగరంలో బర్డ్ ఫ్లూ (Bird Flu / Avian Influenza) వైరస్ కలకలం రేపుతోంది. ఇటీవల నగరంలోని అడయార్, ఆవడి, వేలచ్చేరి, ఈసీఆర్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కాకులు అకస్మాత్తుగా మృతి చెందాయి. అయితే మొదట ఇవి సాధారణ మరణాలేనని భావించినప్పటికీ, భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ పరీక్షల్లో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయంజా H5N1 వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. జనవరి నుంచి ఇప్పటివరకు 1,500కు పైగా కాకులు చనిపోయినట్లు సమాచారం.
బర్డ్ ఫ్లూ నిర్ధారణతో చెన్నై కార్పొరేషన్, పశుసంవర్ధక శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. ప్రభావిత ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తూ, మృతిచెందిన పక్షులను 8–10 అడుగుల లోతులో పూడ్చుతున్నారు. నగరంలోని కోళ్ల ఫారాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. చనిపోయిన పక్షులను చేతులతో తాకవద్దని, పిల్లలను దూరంగా ఉంచాలని సూచించింది. పక్షులు మృతిచెందితే వెంటనే 1962 హెల్ప్లైన్ లేదా మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది.
పౌల్ట్రీ మాంసం, గుడ్లను పూర్తిగా ఉడికించి తినాలని, పార్కులు వంటి ప్రాంతాల్లో మాస్క్ ధరించాలని సూచించింది. భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే ప్రమాదం నివారించవచ్చని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
also read:Bharat Taxi | డ్రైవర్లకు నేరుగా లాభాలు, దేశీయ రవాణా రంగంలో విప్లవం…
