బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మరియు ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై మరోసారి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కోఠారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ₹60.48 కోట్ల మోసం కేసు నమోదు అయింది. ఈ కేసు మొత్తము ₹10 కోట్లకు మించి ఉండటంతో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) దర్యాప్తు చేపట్టింది.
దీపక్ కోఠారి తన ఫిర్యాదులో వివరించిన ప్రకారం, 2015లో రాజేశ్ ఆర్య అనే ఏజెంట్ ద్వారా శిల్పా – కుంద్రాతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో వీరిద్దరూ బెస్ట్ డీల్ టీవీ అనే ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫాం డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీలో వీరికి 87% వాటా ఉందని కోఠారి పేర్కొన్నారు. వ్యాపార విస్తరణ కోసం భారీగా నిధులు అవసరమని, పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని హామీ ఇచ్చారని తెలిపారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం –
- 2015 ఏప్రిల్: మొదటి విడతగా ₹31.95 కోట్లు ఇచ్చారు.
- 2015 జూలై – 2016 మార్చి: మరో ₹28.54 కోట్లు బదిలీ చేశారు.
ఇలా మొత్తంగా ₹60.48 కోట్లు పెట్టుబడి పెట్టారు. డబ్బు సకాలంలో తిరిగి ఇస్తామని, ఈ విషయంలో శిల్పా స్వయంగా సమావేశంలో హామీ ఇచ్చి ఒప్పందం కూడా చేసుకున్నారని కోఠారి పేర్కొన్నారు.
కానీ 2016 సెప్టెంబర్లో శిల్పా శెట్టి డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. తరువాత బెస్ట్ డీల్ టీవీపై ₹1.28 కోట్ల దివాలా కేసు ఉందని తాను తెలిసుకున్నానని, ఈ విషయం అప్పట్లో తనకు చెప్పలేదని కోఠారి ఆరోపించారు. పెట్టిన నిధులు వ్యాపార విస్తరణకు కాకుండా శిల్పా వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముంబై పోలీసులు మోసం, నమ్మకద్రోహం, నకిలీ పత్రాల సృష్టి వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెద్ద మొత్తంలో మోసం జరగడంతో దర్యాప్తు EOWకి బదిలీ చేశారు.
దర్యాప్తులో అధికారులు పరిశీలించబోయే అంశాలు:
- కోఠారి నుంచి కుంద్రా – శిల్పాకు, కంపెనీకి నిధుల బదిలీ వివరాలు.
- 2015 తర్వాత బెస్ట్ డీల్ టీవీ ఆర్థిక నివేదికలు.
- పెట్టిన డబ్బు వ్యాపారానికి ఉపయోగించారా లేదా.
- ఆర్థిక నిర్ణయాల్లో శిల్పా, రాజ్ పాత్ర.
ఈ ఆరోపణలు నిజమని తేలితే, ఆస్తుల స్తంభింపజేత, జైలు శిక్ష వంటి కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
రాజ్ కుంద్రా గతంలో కూడా వివాదాస్పద కేసుల్లో చిక్కుకున్నారు. 2021లో అశ్లీల కంటెంట్ కేసు, ఇతర వ్యాపార వివాదాల్లో ఆయన పేరు వినిపించింది. శిల్పా శెట్టి మాత్రం తన భర్త వ్యాపారాల నుండి తనకు సంబంధం లేదని పలు సందర్భాల్లో చెప్పినా, ఆ సమయంలో కంపెనీ డైరెక్టర్గా ఉండటం వల్ల ఇప్పుడు ఆమెపైనా ఆరోపణలు ఎదురవుతున్నాయి.
ప్రస్తుతం శిల్పా లేదా రాజ్ కుంద్రా ఈ కేసుపై పబ్లిక్గా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈఓడబ్ల్యూ దర్యాప్తు కొనసాగుతుండగా, ఇది వ్యాపార వైఫల్యమా లేక ఉద్దేశపూర్వక మోసమా అన్నది విచారణలో తేలనుంది.