రియల్ ఎస్టేట్ మార్కెట్లో అమ్మకాలు మందగించడంతో తెలంగాణలో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఇళ్లు, ప్లాట్లు అమ్మకాలు కష్టంగా మారడంతో యజమానులు లక్కీ డ్రా పద్ధతిని ఎంచుకుంటున్నారు. రూ.500 నుంచి ₹1000 వరకు కూపన్లు విక్రయించి, డ్రాలో గెలిచిన వారికి ఆస్తి బహూకరిస్తున్నారు.
ఈ వినూత్న పద్ధతి ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. నల్గొండకు చెందిన రమేశ్ తన ఆరు గదుల ఇంటిని రూ.999 కూపన్ల లక్కీ డ్రాలో పెట్టగా, చౌటుప్పల్కి చెందిన మరో వ్యక్తి రూ.500 కూపన్లతో ఇల్లు విక్రయించి ₹18 లక్షలు సంపాదించాడు.
తక్కువ పెట్టుబడితో ఇల్లు గెలుచుకునే ఆశతో ప్రజలు ఈ కొత్త ధోరణి వైపు ఆకర్షితులవుతున్నారు.
ఇటీవల చౌటుప్పల్లో జరిగిన లక్కీ డ్రాలో సంగారెడ్డి జిల్లాకు చెందిన 10 నెలల హన్సిక రూ.16 లక్షల విలువైన ఇంటిని గెలుచుకుంది. రేకుల గదితో 66 గజాల స్థలం యజమాని కంచర్ల రామబ్రహ్మం ఈ డ్రా ద్వారా విక్రయించారు.
లక్కీ డ్రా చట్టబద్ధం కాకపోయినా, యజమానులు ఎక్కువ సొమ్ము సంపాదించడమే కాకుండా, తక్కువ మొత్తంలో ఇల్లు గెలుచుకున్నవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
