ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో భద్రతను మరింత కఠినతరం చేశారు. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మరియు సభాస్థలానికి ఐదు కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. ఈ పరిధిలో డ్రోన్లు, బెలూన్లను ఎగరేయడం పూర్తి నిషేధితమని అధికారులు హెచ్చరించారు.
గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రజలను బెలూన్లు, డ్రోన్ల వాడకం నుంచి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటల పాటు సీసీ కెమెరాల సహాయంతో పర్యవేక్షణ కొనసాగుతుంది. ఏవైనా అనుమానాస్పద చలనం కనిపించిన వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగుతున్నాయి.
మోదీ తిరువనంతపురం నుంచి గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతికి చేరుతారు. వాతావరణం అనుకూలించని పక్షంలో రెండు ప్రత్యామ్నాయ రహదారి మార్గాలు సిద్ధం చేశారు. ఈ మార్గాల్లో కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించి భద్రతపై సమీక్ష చేపట్టారు.
సభకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 100 మంది ఆర్డీవోలు, 200 మంది తహసీల్దార్లు ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించబడ్డారు. 30 వైద్య బృందాలు, 21 అంబులెన్స్లు, తాత్కాలిక ఆసుపత్రులతో అత్యవసర వైద్య సేవలు సిద్ధంగా ఉంచారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, నారాయణ, కొల్లు రవీంద్ర ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.