తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా పాలన వారోత్సవాలను డిసెంబర్ 9న ఘనంగా నిర్వహించి, రెండు రోజుల వ్యవధిలోనే తొలి విడత పోలింగ్ షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 5 రోజుల గ్యాప్తో మూడు విడతల్లో ఎన్నికలు జరిపి కొత్త పంచాయతీ పాలకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని 90 శాతం గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్ లక్ష్యం. పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు గ్రామ స్థాయిలో కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో గట్టిపోటీ ఉండే అవకాశం ఉండడంతో పార్టీ ప్రత్యేక వ్యూహం రూపొందిస్తోంది.
ALSO READ:President Murmu Visit AP: సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. చిన్న పంచాయతీల్లో ఏకగ్రీవాలు సాధారణం కాగా, ప్రోత్సాహకాలు కూడా ఉండే అవకాశం ఉంది.
గతంలో కేసీఆర్ స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహించారో, ఈసారి కాంగ్రెస్ కూడా అలాంటి స్థాయిలో ఫలితాలు సాధించాలని చూస్తోంది. గ్రామ రాజకీయాల్లో కాంగ్రెసుకు బలమైన స్థానం సంపాదించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
