రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ఏపీలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఈనెల 6 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు నిర్వహించే ఈ సమావేశాల ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
రెవెన్యూ శాఖ మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ సదస్సుల నిర్వహణకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి జిల్లాలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, జెసి శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సదస్సుల్లో భూ రికార్డుల పరిశీలన, భూ పంపిణీ సమస్యల పరిష్కారం, వివాదాస్పద భూముల పునరావాసం వంటి ముఖ్యాంశాలపై చర్చించనున్నారు. జిల్లా అధికారులు తమ పరిధిలోని సమస్యలను నిష్పక్షపాతంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
రాష్ట్ర స్థాయి నుండి జిల్లాల స్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యప్రసాద్ హితవు పలికారు. ఈ సదస్సులు భూ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.
