ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన కోసం బయల్దేరారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, రాబోయే రోజుల్లో ఫ్రాన్స్, అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలకమని అన్నారు.
ఫ్రాన్స్లో జరిగే ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొంటానని మోదీ ప్రకటించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, ఈ సమ్మిట్లో నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ సహకారం గురించి చర్చించనున్నట్టు తెలిపారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్తో కూడా ప్రధాని మోదీ కీలక చర్చలు జరపనున్నారు. ఇండియా-ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముందని పేర్కొన్నారు. అంతేకాక, మార్సిల్లే నగరంలో భారత కాన్సులేట్ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
ఆ తర్వాత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ అమెరికా నాయకులతో సమావేశాలు జరిపి, వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరచేలా చర్చలు సాగించనున్నారు. ఈ పర్యటన ద్వారా భారత అంతర్జాతీయ కూటమిలోని పాత్ర మరింత బలపడనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
