పార్వతీపురం, అక్టోబరు 3: ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ (పీఎం జుగా ) పధకాన్ని వినియోగించుకొని గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ (పీఎం జుగా) కార్యక్రమం అమలుకు శాఖల వారీగా కావలసిన ప్రతిపాదనలపై కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లడుతూ పీఎం జుగా కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం, ప్రతి కుటుంబానికి ఇళ్లు, మంచినీటి కుళాయి, కరెంటు సౌకర్యం కల్పన మొదటి ప్రాధాన్యంగా ప్రతిపాదనలు తయారుచేయాలని తెలిపారు. గ్రామాల అభివృద్దికి ప్రతి గ్రామంలో రోడ్లు, ఇంటి నిర్మాణం, కరెంటు సదుపాయం, మంచినీటి కుళాయి ఏర్పాటు, మెబైల్ నెట్ వర్కు కల్పన, వైద్య సదుపాయాలు ఏర్పాటు, ప్రతి కుటుంబానికి ఆదాయం పెంపు మొదలైన 25 అంశాలకు సంబంధించిన పనులను చేపట్టవచ్చునని తెలిపారు. వారం రోజులలో ప్రతి పధకానికి శాఖల వారీగా ప్రతిపాదనలు తయారుచేసి సమర్పించాలని కలెక్టరు ఆదేశించారు.
సమావేశంలో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, ఎ.పి.ఒ. మురళీధర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకరరావు,జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి రవి, జిల్లా పశుసంవర్ధక అధికారి ఎస్. మన్మథ రావు, జిల్లా విద్యా శాఖ అధికారి జి. పగడాలమ్మ, జిల్లా మత్స్య శాఖ అధికారి వి. తిరుపతయ్య, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.