దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఎమర్జెన్సీ వివాదం నేపథ్యంలో ఇప్పటికే అభిశంసనను ఎదుర్కొంటున్న యూన్పై దర్యాప్తు సంస్థలు కోర్టులో అరెస్టు వారెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సియోల్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈ వారెంట్ను మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో త్వరలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
యూన్ సుక్ యోల్పై మార్షల్ లా ప్రకటించడంపైనా దర్యాప్తు జరుగుతోంది. దీనిపై న్యాయవాదులు, రక్షణ మంత్రిత్వ శాఖ, అవినీతి నిరోధక శాఖలతో కూడిన జాయింట్ టీమ్ విచారణ చేపట్టింది. మూడు సార్లు విచారణకు నోటీసులు పంపినా ఆయన హాజరుకాకపోవడం, సహకరించకపోవడంతో దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించారు.
మార్షల్ లా ప్రకటన దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపణలతో విపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. 204 మంది అనుకూలంగా ఓటు వేయగా, 85 మంది వ్యతిరేకించారు. ఇది యూన్ తన అధికార బాధ్యతలను ప్రధాన మంత్రి హన్ డక్ సూకికి అప్పగించేందుకు దారితీసింది. ఈ తీర్మానం రాజ్యాంగ న్యాయస్థానానికి పంపబడింది.
రాజ్యాంగ న్యాయస్థానం ఈ అంశంపై 180 రోజుల్లో తుది తీర్పు ఇస్తుంది. అయితే, యూన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు పేర్కొన్నారు. ఈ పరిణామాలు దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
