ప్రధాని నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ డీకే అరుణ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత రేవంత్కు ఉందా? సీఎం హోదాలో ఉండి కులం గురించి మాట్లాడడం సిగ్గుచేటు కాదా? అని ప్రశ్నించారు.
మోదీతో పెట్టుకున్న అరవింద్ కేజ్రివాల్, కేసీఆర్ పరిస్థితి ఏంటో గమనించాలని రేవంత్కు హితవు పలికారు. ఎవరిని మెప్పించడానికి రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ పట్ల అనవసర విమర్శలు చేయడం తగదని అన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మోసపోయిన ప్రజలు ఇప్పుడు వారి తప్పును గుర్తిస్తున్నారని అన్నారు. వ్యక్తిగత దూషణల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రధాని మోదీ త్యాగాలను అర్థం చేసుకుని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై గౌరవం కలిగి ఉన్నారని, అలాంటి మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా రేవంత్ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే ప్రజలు సమాధానం చెబుతారని డీకే అరుణ పేర్కొన్నారు.