ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు గుర్వీందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ (18)గా గుర్తించబడ్డారు. ఈ ముగ్గురు ఖలిస్థాన్ కమాండో ఫోర్స్కు చెందిన వారిగా పోలీసులు చెప్పారు.
పంజాబ్, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో వీరు హతమైనట్టు అధికారులు తెలిపారు. వీరు పంజాబ్లో గురుదాస్పూర్ జిల్లా కలానౌర్ సబ్ డివిజన్ పోలీస్ పోస్టుపై ఈ నెల 21న చేసిన దాడికి సంబంధించి నిందితులుగా ఉన్నారు.
ఎన్కౌంటర్ సమయంలో పోలీసులు రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లోక్ పిస్టళ్లు, లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పిలిభిత్ జిల్లాలోని పురానపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరు సంచరిస్తున్నట్లు పంజాబ్ పోలీసులు సమాచారాన్ని అందించారు.
ఈ మేరకు అప్రమత్తమైన పిలిభిత్ పోలీసులు వారి కోసం ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఉదయం ఇరు వర్గాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.
