YS Jagan: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు పులివెందుల ప్రాంతంలో ప్రజలతో మమేకం కానున్నారు. ఈ పర్యటనలో ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు. పర్యటనలో భాగంగా 23వ తేదీ సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న జగన్, భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, వినతులను స్వీకరించనున్నారు. అనంతరం పులివెందులలోని తన నివాసంలో బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం వేముల మండలంలోని భూమయ్యగారిపల్లెకు వెళ్లనున్న ఆయన, అక్కడ నిర్వహించనున్న గట్టు లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నూతన దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆలయ మహోత్సవాల్లో పాల్గొన్న తర్వాత ఆయన తిరిగి పులివెందులకు చేరి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 25వ తేదీ ఉదయం పులివెందుల నుంచి ఆయన తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ మూడు రోజుల పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలపై ఆరా తీసే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే పలు స్థానిక అంశాలపై కూడా జగన్ స్పందించే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పులివెందుల ప్రాంతంలో పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించాయి.








