రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాల్లో రెండేళ్ల కాలంలో సాధించిన పురోగతిని ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదికల విడుదలకు సిద్ధమైంది. ‘ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26’(Progress Report 2024-26)పేరుతో పలు కీలక రంగాలపై సమగ్ర నివేదికలను విడుదల చేయాలని నిర్ణయించింది. మొత్తం పది అంశాలకు సంబంధించిన వివరాలను విడివిడిగా ప్రజల ముందుకు తీసుకురానుంది.
అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, సుపరిపాలన, సంక్షేమం-సాధికారత వంటి నాలుగు ప్రధాన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నివేదికలను విడుదల చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్, శాంతిభద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలకు సంబంధించిన నివేదికలను ఆయా శాఖల మంత్రులు ప్రకటించనున్నారు.
విద్యుత్ రంగానికి సంబంధించిన నివేదికను తొలుత ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియను జులై 18లోపు పూర్తి చేసి, అనంతరం అన్ని నివేదికలను సమగ్ర పుస్తక రూపంలో తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో వివిధ రంగాల పరిస్థితులపై విడుదల చేసిన శ్వేతపత్రాలను గుర్తు చేసిన చంద్రబాబు, వాటిలో ప్రస్తావించిన అంశాలపై రెండేళ్లలో తీసుకున్న చర్యలను కూడా తాజా నివేదికల్లో చేర్చాలని సూచించారు. గత పాలనలో ఎదురైన సమస్యల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఎలా నడిపించామన్న విషయాన్ని ప్రజలకు వివరించడమే ఈ నివేదికల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, పరిపాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు, పీ-4 వంటి అంశాల్లో సాధించిన ఫలితాలను కూడా ఇందులో పొందుపరచనున్నారు. తప్పుడు ప్రచారాలకు సమాధానం ఇవ్వడంతో పాటు పాలనలో పారదర్శకతను పెంచేందుకు ప్రతి ఏడాది ఇలాంటి నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
అభివృద్ధి నుంచి పోలవరం వరకు.. ‘ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26’ విడుదలకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం
-








