హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మూసీ రివర్ ఫ్రంట్(Gandhi Sarovar project) ప్రాజెక్టుకు సంబంధించి మరో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా బాపు ఘాట్ ప్రాంతాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ నుండి నిర్మాణ అనుమతులు అధికారికంగా ఆమోదించబడ్డాయి.
గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలో ఉన్న భూమిలో ఈ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టంచేసింది. మొత్తం 83.818 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.533.42 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ఈ నిర్ణయం మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
నది తీర ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేసి పర్యావరణ సమతుల్యతను మెరుగుపరచడమే కాకుండా, ప్రజలకు ఆహ్లాదకరమైన పబ్లిక్ స్పేస్లు, సాంస్కృతిక కేంద్రాలు, పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది. కేంద్ర అనుమతులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, భారత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధి విజన్లో ఒక ముఖ్య ఘట్టమని ఆయన పేర్కొన్నారు. మూసీ నది సమగ్ర పునరుజ్జీవనం ద్వారా హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ పరంగా మరింత శుభ్రంగా, సుస్థిరంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
Gandhi Sarovar project | గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు అనుమతి.. కేంద్రానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు
-








