CP Sajjanar: స్కూల్ పరిసరాల్లో ట్రాఫిక్ క్రమశిక్షణ, విద్యార్థుల భద్రతపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రత్యేకంగా స్పందించారు.హైదరాబాద్లో సుమారు 3,500 స్కూల్స్ ఉండగా, వాటిలో సుమారు 12 లక్షల మంది పిల్లలు చదువుతున్నారని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు చదువుతో పాటు చిన్నప్పటి నుంచే రహదారి భద్రతపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సూచించారు.
ఇటీవలి కాలంలో మైనర్ డ్రైవింగ్ ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్, ఇకపై అలాంటి ఘటనలపై ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడిపి పట్టుబడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా రోజుకు సగటున 45 మంది పిల్లలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన పేర్కొంటూ, ఇది అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి అని చెప్పారు. పిల్లల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. స్కూల్ యాజమాన్యాలకు కూడా ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. విద్యా సంస్థల్లో విద్యతో పాటు సురక్షిత వాతావరణం కల్పించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు ఇంటి నుంచి స్కూల్కు వచ్చి తిరిగి వెళ్లే వరకు వారి భద్రత పూర్తిగా స్కూల్ బాధ్యతేనని స్పష్టం చేశారు.
స్కూళ్లలో సీసీటీవీ వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, స్కూల్ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడతామని వెల్లడించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు కూడా నిరంతరం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. సురక్షితమైన స్కూల్ వాతావరణం కోసం పోలీస్, విద్యా, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.
ALSO READ: యోగా దినోత్సవం ప్రత్యేకత ఏమిటి?.. థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత పూర్తి వివరాలు








