Mahesh Kumar Goud: ఆషాఢ మాస బోనాల మహోత్సవాలు నిజామాబాద్లో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించబడ్డాయి. పాత కలెక్టరేట్ ప్రాంగణంలో టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, తెలంగాణ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కూడా పాల్గొని భక్తులతో కలిసి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు మహేష్ కుమార్ గౌడ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి పండుగలు సమాజంలో ఐక్యత, సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.
ఈ వేడుకల్లో కార్పొరేషన్ చైర్మన్లు కేశ వేణు, శేఖర్ గౌడ్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, టీఎన్జీఓఎస్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.








