G7 Summit: ఫ్రాన్స్లో నిర్వహిస్తున్న జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్, మోడీని ఆత్మీయంగా పలకరిస్తూ లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇవ్వడం అక్కడి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఇరు దేశాలకు సంబంధించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు.
ఇటీవల ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో జరిగిన ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణించే నౌకలకు భద్రత కల్పించాల్సిన అవసరాన్ని ఆయన వివరించినట్లు సమాచారం.
ఇదే సమయంలో భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా ప్రధాన అంశంగా నిలిచాయి. ఇప్పటికే ఇరు దేశాలు మధ్యంతర ఒప్పందం దిశగా ముందడుగు వేయగా, తాజా సమావేశం అనంతరం సమగ్ర వాణిజ్య ఒప్పందం మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాబోయే వారాల్లో దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా ఇరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు, గ్యాస్ మార్కెట్లపై మధ్యప్రాచ్య పరిణామాలు చూపుతున్న ప్రభావంపై ఇరు దేశాధినేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్కు దీర్ఘకాలిక ఇంధన భద్రత కల్పించే దిశగా అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై కూడా మోడీ, ట్రంప్ మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు సమాచారం. ఇంధన రంగంలో వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ముందుకు సాగనున్నాయి.








