Telangana Public School: ప్రభుత్వ విద్యను మరింత నాణ్యమైనదిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. పాఠశాల భవనంతో పాటు టీపీఎస్ పైలాన్ను ఆవిష్కరించిన సీఎం, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తూ వారితో ముచ్చటించారు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూ.15 కోట్ల వ్యయంతో ఈ పాఠశాలను నిర్మించారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్యను అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ విద్యాసంస్థలో 1,814 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని డిజిటల్ క్లాస్రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, జిమ్నాసియం, డైనింగ్ హాల్స్ వంటి ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అలాగే క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్ వంటి క్రీడల కోసం ప్రత్యేక మైదానాలు, శిక్షకులను అందుబాటులో ఉంచారు. సమీప గ్రామాల విద్యార్థుల రాకపోకల కోసం ఐదు ప్రత్యేక బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించే విధానాన్ని అమలు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా నాలుగు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
Telangana Public School | విద్యారంగంలో కొత్త అధ్యాయం.. రంగారెడ్డి జిల్లాలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం
-








