Pawan Kalyan: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. అరుదైన డీఎండీ (డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ) వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన వీరాభిమాని నిరంజన్ను స్వయంగా అతడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
హనుమకొండలోని హనుమాన్ నగర్కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో జీవితంలో ఒక్కసారైనా పవన్ను కలవాలని కోరిక వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన అధినేత బుధవారం అతడి నివాసానికి చేరుకుని అభిమానిని ఆప్యాయంగా పలకరించారు.
మంచంపై ఉన్న నిరంజన్ను హత్తుకుని నుదిటిపై ముద్దు పెట్టిన పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలు, పవిత్ర వస్త్రాన్ని అందజేసి ఆశీర్వదించారు. వైద్య ఖర్చుల కోసం రూ.1 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి మరిన్ని వైద్య సహాయ అవకాశాలపై ఆరా తీశారు.
తనను అందరూ “చోటా గబ్బర్ సింగ్” అని పిలుస్తారని నిరంజన్ చెప్పగా పవన్ చిరునవ్వులు చిందించారు. పెంపుడు కుక్కను పెంచుకోవాలన్న నిరంజన్ కోరికను కూడా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అలాగే నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని తెలిపారు.
నిరంజన్ తల్లిదండ్రుల జీవనోపాధి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా అవకాశాలను పరిశీలించాలని పార్టీ నేతలకు సూచించారు. అనంతరం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Pawan Kalyan | ‘చోటా గబ్బర్ సింగ్’ను హత్తుకున్న పవన్ కళ్యాణ్.. రూ.లక్ష సాయం, కుటుంబానికి భరోసా
-








