Rain Alert: రాబోయే 48 గంటల్లో తెలంగాణలో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ బుధ, గురువారాల్లో అనేక జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు తీరాలను త్వరలో తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాత్రంతా భారీ వర్షపాతం నమోదైంది. ఏన్కూరు మండలంలో 7.9 సెం.మీ., తల్లాడలో 6 సెం.మీ., అశ్వారావుపేటలో 4 సెం.మీ. వర్షపాతం రికార్డైంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది.
గుంటూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. రాబోయే రెండు రోజులు వాతావరణం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: Mamata Banerjee | టీఎంసీలో సంక్షోభం.. అన్ని కమిటీలను రద్దు చేసిన మమతా బెనర్జీ








