KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యువత కోసం ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో యువత పాత్ర కీలకమని, వారి సమస్యలపై బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోతుందని హెచ్చరించారు.
సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించారు. యువతను మోసం చేసినందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో తమ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటామని, అయితే యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. యూత్ డిక్లరేషన్లో భాగంగా తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కంటే ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని విమర్శించారు. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు.
రేవంత్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచిందని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాల క్రెడిట్ను కాంగ్రెస్ తీసుకుంటోందని ఆరోపించారు. 70 వేల ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు చూపించాలని, నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సీఎం రేవంత్కు సవాల్ విసిరారు.








