Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఇటీవల తీవ్రమైన అంతర్గత అస్థిరతను ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత పార్టీ లోపల విభేదాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వాన్ని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సరిగా పాటించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కోల్కతాలో జరిగిన తాజా పార్టీ సమావేశానికి అనేక మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం, ఈ విభేదాలు మరింత తీవ్రమని సూచించింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం కొద్దిమంది మాత్రమే పాల్గొనడం పార్టీ లోపల తిరుగుబాటు సంకేతాలుగా భావిస్తున్నారు. రీబెల్ వర్గం నేతృత్వంలో కొందరు నేతలు పార్టీ హైకమాండ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి చెందిన అన్ని కమిటీలు, అనుబంధ సంస్థలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయాన్ని టీఎంసీ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పార్టీ స్థాయిలో సమగ్ర ఆత్మపరిశీలన, పనితీరు సమీక్ష, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలిపింది. టీఎంసీకి యువజన, మహిళా, కార్మిక, విద్యార్థి విభాగాలు సహా సుమారు 16 అనుబంధ సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి కమిటీలు కూడా పనిచేస్తున్నాయి.
ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్గత సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమగ్ర మార్పులు చేపట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తులో కొత్త నిర్మాణంతో పార్టీని మరింత బలపరచే దిశగా చర్యలు తీసుకుంటామని సమాచారం.
ALSO READ: KTR | పవన్ కల్యాణ్పై కేటీఆర్ ఫైర్.. తెలంగాణ భూమి పుత్రులదేనని స్పష్టీకరణ








