మధ్య ఆఫ్రికాలోని కాంగోను ఎబోలా(Congo Ebola) వైరస్ మరోసారి వణికిస్తోంది. కేసులు, మరణాలు పెరుగుతుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.మే 15 తర్వాత కాంగోలో ఎబోలా కేసులు క్రమంగా పెరుగుతూ, మొత్తం బాధితుల సంఖ్య 2,344కు చేరిందని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే 930 మందికిపైగా మరణించగా, గత 24 గంటల్లోనే మరో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం నమోదవుతున్న అన్ని కేసులు బుండిబుగ్యో ఎబోలా రకానికి చెందినవేనని స్పష్టం చేశారు. ఈ వైరస్ వ్యాప్తిని మే 15న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి నియంత్రణ చర్యలు కొనసాగుతున్నా, ఈ రకానికి ఇప్పటివరకు సమర్థవంతమైన వ్యాక్సిన్ లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎబోలా వైరస్ ప్రధానంగా గబ్బిలాలు వంటి అడవి జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన జంతువుల మాంసాన్ని తినడం లేదా బాధితుల రక్తం, లాలాజలం, చెమట, వాంతులు వంటి శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం కలిగితే సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 21 రోజుల వరకు లక్షణాలు కనిపించకపోవచ్చు. తొలుత సాధారణ జ్వరం లేదా ఫ్లూ మాదిరిగా అనిపించినా, తర్వాత తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు, నీరసం, అవయవాల వైఫల్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొందరిలో అంతర్గత, బాహ్య రక్తస్రావం కూడా సంభవిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Vivo X300e 5G దుమ్మురేపుతోంది.. కెమెరా, బ్యాటరీ ఫీచర్లు సూపర్!, ధర సస్పెన్స్ ?








