Maharashtra: మహారాష్ట్రలోని పర్భాణి జిల్లాలో శనివారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. సేలు తాలూకాలోని రావల్గావ్ గ్రామానికి చెందిన పురాతన హనుమాన్ ఆలయంలో పైకప్పు భాగంలోని కాంక్రీట్ స్లాబ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో అక్కడ ఉన్న భక్తుల్లో ఒకరు మృ**తి చెందగా, మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. శనివారం కావడంతో ఉదయాన్నే ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో భక్తులు గర్భగుడి బయట నిలబడి ప్రార్థనలు చేస్తున్న సమయంలో పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఉత్తమ్ రావు లహనే (65) అనే వృద్ధుడు శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు.
అలాగే మరికొంత మంది భక్తులు శిథిలాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని జాల్నా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఆలయం చాలా పాతదిగా ఉండటం, ఇటీవలి వర్షాల కారణంగా కాంక్రీట్ బలహీనపడటమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దుర్ఘటనతో రావల్గావ్ గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.








