Indian Railways: రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన రైల్వే బోర్డు, జరిమానా మొత్తాన్ని పెంచుతూ కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జన్ విశ్వాస్ సవరణ చట్టం-2026కు అనుగుణంగా ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకు టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన వారిపై కనీసంగా రూ.250 జరిమానా విధించేవారు. అయితే తాజా మార్పులతో ఆ మొత్తాన్ని రూ.500కు పెంచారు. రైల్వే చట్టం-1989లోని సంబంధిత నిబంధనలకు చేసిన సవరణల ఆధారంగా ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. అనధికారిక ప్రయాణాలను నియంత్రించడం, ప్రయాణికుల్లో బాధ్యతాయుతమైన వ్యవహారాన్ని ప్రోత్సహించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుండటంతో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశారు.
దీనికి ఉదాహరణగా సెంట్రల్ రైల్వే పరిధిలో గత మే నెలలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో దాదాపు ఐదు లక్షల మంది ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణిస్తూ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాల రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. తాజా నిబంధనల నేపథ్యంలో ప్రయాణికులు రైలులో ఎక్కే ముందు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టికెట్ను కలిగి ఉండాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే అధిక జరిమానా చెల్లించాల్సి ఉంటుందని రైల్వే శాఖ హెచ్చరిస్తోంది.
Indian Railways | టికెట్ లేకుంటే చెల్లించాల్సిందే.. ఫైన్ను రెట్టింపు చేసిన భారతీయ రైల్వే శాఖ
-








