IND VS AFG ODI: అఫ్గానిస్థాన్పై వరుసగా రెండు విజయాలు సాధించి సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా, ఇప్పుడు మూడో వన్డేకు సిద్ధమవుతోంది. చెన్నై వేదికగా జూన్ 20న జరగనున్న మూడో వన్డేకు ముందు భారత జట్టుకు శుభవార్త అందింది. గాయం కారణంగా గత కొన్ని నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్న యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా(Harshit Rana) మళ్లీ జట్టుతో చేరాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడిన హర్షిత్ రాణా, టీ20 ప్రపంచకప్-2026తో పాటు ఐపీఎల్ 2026లోనూ ఆడే అవకాశాన్ని కోల్పోయాడు.
అనంతరం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాస ప్రక్రియ పూర్తి చేసుకున్న అతడు ఇప్పుడు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా వెల్లడించారు. 24 ఏళ్ల హర్షిత్ రాణా ఇప్పటివరకు భారత్ తరఫున 14 వన్డేలు ఆడి 16 వికెట్లు సాధించాడు. 27.38 బౌలింగ్ సగటుతో పాటు 6.21 ఎకానమీ రేటును నమోదు చేశాడు. వేగంతో పాటు డెత్ ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యం అతనికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో చివరిసారిగా కనిపించిన హర్షిత్, ఇప్పుడు మళ్లీ జాతీయ జట్టులోకి రావడంతో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని పొందాడు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం కూడా జాతీయ సెలెక్టర్లు హర్షిత్ రాణాపై నమ్మకం ఉంచడంతో, అతడి కెరీర్కు ఈ సిరీస్ కీలక పరీక్షగా మారనుంది. చెన్నైలో జరిగే నామమాత్రమైన మూడో వన్డేలో హర్షిత్ రాణా ప్రదర్శనపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








