Thailand Football Match: వర్షాకాలం అంటే రైతులకు ఆశలు.. కానీ అదే సమయంలో కొన్ని ప్రమాదాలకు కూడా కారణం. ఉరుములు, మెరుపులతో వచ్చే పిడుగులు క్షణాల్లో ప్రాణాలు తీస్తున్నాయి. గ్రామాల్లో పొలాల్లోకి వెళ్లేవారు, బయట తిరిగేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. తాజాగా థాయ్లాండ్లో చోటుచేసుకున్న పిడుగుపాటు ఘటన.. వర్షాకాలంలో అప్రమత్తత ఎంత అవసరమో మరోసారి తెలియజేసింది. ఫుట్బాల్ మైదానం ఒక్కసారిగా విషాదంగా మారింది. థాయ్లాండ్లో జరిగిన ఓ స్థానిక టోర్నమెంట్ మ్యాచ్లో పిడుగుపాటుకు 24 ఏళ్ల యువ ఆటగాడు సోఫ్వాన్ అవే ప్రాణాలు కోల్పోయాడు.
దక్షిణ థాయ్లాండ్లోని గోలోక్ ఎఫ్ఏ కప్ టోర్నమెంట్లో భాగంగా శామ్కోల్ట్స్ జట్టు, అబూ ఎక్స్ నాంగ్ సిరిన్ జట్టు మధ్య మ్యాచ్ జరుగుతోంది. వర్షం కురుస్తున్నప్పటికీ ఆట కొనసాగుతుండగా, ఒక్కసారిగా భారీ శబ్దంతో మైదానంలో పిడుగు పడింది. ఈ ప్రమాదంలో సోఫ్వాన్ అవే తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మరో 12 మంది ఆటగాళ్లు గాయపడటంతో తీవ్ర విషాదం నెలకొంది. సహచర ఆటగాళ్లు, సిబ్బంది వెంటనే అతని వద్దకు చేరుకుని సహాయం అందించేందుకు ప్రయత్నించారు. అత్యవసర వైద్య బృందాలు చికిత్స అందించినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా అతడిని కాపాడలేకపోయారు. ఈ ఘటనపై థాయ్లాండ్ ఫుట్బాల్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబానికి, క్లబ్ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను పట్టించుకోకపోవడంపై సోషల్ మీడియాలో నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తాయి. వర్షాలు, ఉరుములు, పిడుగుల సమయంలో క్రీడా కార్యక్రమాలను నిలిపివేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. థాయ్లాండ్లో పిడుగుపాటుకు మరణాలు తరచుగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 2020 నుంచి 2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పిడుగుపాటుకు గురైనట్లు నివేదికలు వెల్లడించాయి.
ALSO READ: Actor R Madhavan | ప్రశంసిస్తే రాజకీయమా?.. ట్రోల్స్పై మాధవన్ ఘాటు స్పందన








