US Citizenship: అమెరికాలో ఇమిగ్రేషన్ విధానాలు మరింత కఠినతరంగా మారుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలపై అనేక మార్పులు తీసుకురావడం తెలిసిందే. తాజాగా అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) చేసిన కొత్త ప్రతిపాదనలు వలసదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం అమెరికా పౌరసత్వ దరఖాస్తు ఫీజులు గణనీయంగా పెరగనున్నాయి. ఇప్పటివరకు ఉన్న రుసుములతో పోలిస్తే దాదాపు 75 శాతం పెంపు సూచించబడింది.
పేపర్ ఆధారిత దరఖాస్తుల ఫీజు 760 డాలర్ల నుంచి 1330 డాలర్లకు పెరగవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా ఆన్లైన్ దరఖాస్తులకు కూడా 710 డాలర్ల నుంచి 1280 డాలర్ల వరకు చెల్లించాల్సి రావచ్చు. దరఖాస్తు తిరస్కరణకు గురైతే తిరిగి సమీక్ష కోరడానికి కూడా భారీ రుసుము వసూలు చేయాలని ప్రతిపాదించారు. ఈ రుసుము 830 డాలర్ల నుంచి 1475 డాలర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే పౌరసత్వ ప్రక్రియ మరింత ఖరీదైనదిగా మారుతుంది.
ఇక ఆదాయ ఆధారిత ఫీజు మినహాయింపులపై కూడా కొత్త మార్పులు సూచించారు. ప్రస్తుతం కొంతమంది తక్కువ ఆదాయం కలిగిన దరఖాస్తుదారులకు తగ్గింపు ఫీజు అందుబాటులో ఉండగా, దాన్ని పూర్తిగా తొలగించే అవకాశం ఉంది. దీంతో మధ్యతరగతి మరియు తక్కువ ఆదాయం ఉన్న వలసదారులపై అదనపు భారం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదిత నిబంధనలపై వచ్చే 60 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.








