PM Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనలను ముగించుకున్న అనంతరం ప్రధాని మోడీ శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. దౌత్య సమావేశాలతో పాటు భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి, హస్తకళలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించే ప్రయత్నం ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
కల్చరల్ డిప్లొమసీకి ప్రాధాన్యం ఇచ్చిన ప్రధాని మోడీ, ఆయా దేశాల అగ్రనేతలకు అందించిన ప్రత్యేక కానుకలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ప్రతి బహుమతి భారతదేశంలోని ఒక ప్రత్యేక ప్రాంతం కళా సంపదను ప్రతిబింబించేలా ఎంపిక చేయడం విశేషం.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు ఆంధ్రప్రదేశ్కు చెందిన మహాభారత కలంకారీ పెయింటింగ్ను ప్రధాని మోడీ అందించారు. సహజ రంగులతో, చేతితో సూక్ష్మంగా రూపొందించే ఈ కళాఖండం పూర్తి కావడానికి నెలల సమయం పడుతుంది. అదే సమయంలో ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్కు తెలంగాణకు చెందిన పోచంపల్లి ఇకత్ సిల్క్ స్టోల్ను బహూకరించారు. స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోకు కాశ్మీరీ సిల్క్ కార్పెట్ను అందించగా, స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినికి హిమ్రూ సిల్క్ టై, పాకెట్ స్క్వేర్ సెట్తో పాటు రాజస్థాన్ థేవా కఫ్లింక్స్ను కానుకగా ఇచ్చారు.
ఇవన్నీ భారత హస్తకళల వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కళాఖండాలు. స్లోవేకియా స్పీకర్ రిచర్డ్ రాసికి ప్రాచీన భారత వైద్య శాస్త్ర గ్రంథాలు చరక సంహిత, సుశ్రుత సంహితను అందించడం ద్వారా భారతీయ జ్ఞాన సంపదను ప్రపంచానికి పరిచయం చేశారు. అలాగే బీహార్, జార్ఖండ్ సంప్రదాయ మిఠాయి తెకువాను కూడా పరిచయం చేశారు.
మొత్తం పర్యటనలో ప్రధాని మోడీ అందించిన ప్రతి కానుక భారతదేశంలోని విభిన్న రాష్ట్రాల కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, జ్ఞానాన్ని ప్రతిబింబించేలా ఉండటంతో, ఇది సాంస్కృతిక దౌత్యంలో మరో ముఖ్యమైన అడుగుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.








