Petrol and Diesel Prices: దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులకు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చమురు కంపెనీలు ఇంధన ధరలను సవరించాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు 90 పైసల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వాహనదారులపై అదనపు భారం పడనుంది.
తాజా పెంపు తర్వాత దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.98.64కి చేరగా, డీజిల్ ధర రూ.91.58కి పెరిగింది. ఇదే సమయంలో కోల్కతాలో అత్యధిక పెరుగుదల నమోదైంది. అక్కడ పెట్రోల్ ధర రూ.109.70కి చేరగా, డీజిల్ ధర రూ.96.07గా నమోదైంది. చెన్నైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి.
ఇప్పటికే రవాణా ఖర్చులు, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ తాజా ధరల పెంపు మరింత భారంగా మారింది. గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా లీటరుకు రూ.3 చొప్పున ధరలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజుల్లోనే మళ్లీ ధరలు పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
అంతర్జాతీయ క్రూడాయిల్ ధరల మార్పులు, దిగుమతి వ్యయాలు పెరగడం వంటి కారణాలతో దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయని చమురు సంస్థలు చెబుతున్నాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం రవాణా రంగంతో పాటు అన్ని వస్తువుల ధరలపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఖర్చులు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది.
ALSO READ: Telangana Government Jobs | తెలంగాణలో ఉద్యోగాల కోసం వయో సడలింపు.. 10 ఏళ్లు పెంచిన ప్రభుత్వం








