Union Home Ministry: దేశ భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద నెట్వర్క్లకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో 23 మందిని అధికారికంగా ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్-35 కింద వీరి పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్లు తెలిపింది.
ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఈ జాబితాలో ఉన్నవారిలో ఎక్కువ మంది జైషే మహ్మద్, లష్కరే తోయిబా, జమాత్-ఉద్-దవా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరు సరిహద్దు అవతల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ నిధుల సమీకరణ, కొత్త సభ్యుల నియామకం, ఆయుధ శిక్షణ, ఉగ్రవాద చర్యలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు పేర్కొంది.
ప్రకటించిన 23 మందిలో 17 మంది పాకిస్థాన్కు చెందినవారని, మరో ఆరుగురు భారతీయులని కేంద్రం వెల్లడించింది. వీరిలో పలువురు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని ఇతర ప్రాంతాలను ఆశ్రయంగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు భారత్లోకి తరలించడం, భద్రతా బలగాల కదలికలపై సమాచారం సేకరించడం వంటి చర్యల్లో కూడా వీరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నిర్ణయంతో దర్యాప్తు సంస్థలకు మరింత చట్టబద్ధమైన అధికారాలు లభించనున్నాయి. ఉగ్రవాదులుగా ప్రకటించిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, వారికి అందుతున్న ఆర్థిక వనరులను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. దీంతో టెర్రర్ ఫండింగ్ నెట్వర్క్లపై గట్టి దెబ్బ పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
అంతేకాకుండా, ఈ జాబితాలోని కొందరికి గతంలో దేశంలో జరిగిన ఉగ్రదాడులతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని కేంద్రం పేర్కొంది. దేశ భద్రతను దెబ్బతీసే ప్రయత్నాలు చేసే వ్యక్తులు, సంస్థలపై ఇకపై మరింత కఠిన చర్యలు కొనసాగుతాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
Union Home Ministry | ఉగ్రవాదానికి చెక్.. 23 మందిని ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
-








