TGSRTC: ఎంబీబీఎస్ సహా వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు కీలకమైన నీట్ యూజీ-2026 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది. జూన్ 21న పరీక్ష రాసే అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి కల్పించింది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు తమ హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డును చూపించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల్లోని పరీక్షా కేంద్రాలకు చేరుకునే పేద విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి నేతృత్వంలోని ప్రతినిధి బృందం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పరీక్ష రోజు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవో కూడా జారీ చేసింది. మరోవైపు నీట్ యూజీ-2026 పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక మార్పులు చేసింది. విద్యార్థులకు సమయం సరిపోవడం లేదన్న అభిప్రాయాల నేపథ్యంలో పరీక్ష వ్యవధిని అదనంగా 15 నిమిషాలు పెంచింది. దీంతో పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు మొత్తం 195 నిమిషాల పాటు కొనసాగనుంది.
అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్కల కోసం ప్రశ్నాపత్ర బుక్లెట్లో రఫ్ వర్క్ పేజీల సంఖ్యను రెండింటి నుంచి నాలుగుకు పెంచింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు వంటి చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పొందేందుకు కూడా ఈ పత్రాలు తప్పనిసరి అని స్పష్టం చేశారు.








