Sri Lanka Test 2026: శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతున్న టీమిండియాకు అనుకోని షాక్ తగిలింది. టెస్టు జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడటంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ తొలి రోజుకు అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం జరిగిన ప్రాక్టీస్ సమయంలో గిల్ కుడి చేతి రింగ్ ఫింగర్కు గాయమైంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అతడికి మ్యాచ్ తొలి రోజు విశ్రాంతి ఇచ్చినట్లు బోర్డు తెలిపింది. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
అయితే గాయం తీవ్రత ఎంత? గిల్ ఎప్పటిలోగా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడు? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. గిల్ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ వార్మప్ మ్యాచ్లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కొలంబోలోని నాన్డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్లో ఆగస్టు 7 నుంచి 9 వరకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు ఇదే చివరి సన్నాహక మ్యాచ్ కావడంతో దీనికి ప్రాధాన్యం పెరిగింది.
కెప్టెన్గా, కీలక బ్యాటర్గా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్న గిల్ గాయం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది ముందు జాగ్రత్త చర్య మాత్రమేనని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆగస్టు 15న ప్రారంభమయ్యే తొలి టెస్టు నాటికి గిల్ పూర్తిగా కోలుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ: Praggnanandhaa | 20 ఏళ్ల వయసులో అరుదైన ఘనత.. ప్రజ్ఞానంద ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్!








