COVID-19 cases: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాష్ట్రంలో మరో రెండు కొత్త కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు, విజయవాడలో ఒక్కొక్కరికి కరోనా సోకినట్లు వైద్య అధికారులు నిర్ధారించారు. గుంటూరు జీజీహెచ్లో బాపట్ల జిల్లా కర్లపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. అలాగే విజయవాడ జీజీహెచ్లో తిరువూరు ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికకు కూడా కరోనా నిర్ధారణ అయింది.
ఈ కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 16కు చేరింది. ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్లో నలుగురు కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే వైద్యశాఖ అధికారులతో సమీక్షించి, కోవిడ్ విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, పరీక్షలు, చికిత్స సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: NIMS Hospital | నిమ్స్లో బాలింతలను పరామర్శించిన హరీశ్రావు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా








