Traffic Challan: వాహనదారులకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్తను ప్రకటించింది. రోడ్డు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఈ-చలానాలు, అలాగే రవాణా శాఖకు చెందిన పాత జరిమానాలపై 50 శాతం రాయితీని ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. దీని ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను తక్కువ మొత్తంలోనే పరిష్కరించుకునే అవకాశం వాహనదారులకు లభిస్తోంది.
జూన్ 21 నుంచి జూలై 10 వరకు ఈ ప్రత్యేక రాయితీ పథకం అమలులో ఉండనుంది. ఈ గడువులో వాహనదారులు తమ పెండింగ్ చలానాలను సగం మొత్తంలో చెల్లించి కేసులను ముగించుకోవచ్చు. జూలై 11న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటక రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ చేసిన సిఫార్సుల ఆధారంగా రవాణా శాఖ ఈ ఆఫర్ను ప్రకటించింది. 1991 నుంచి 2022 మధ్య నమోదైన పాత కేసులతో పాటు, మే 2026 నాటికి పోలీసుల రికార్డుల్లో ఉన్న అన్ని పెండింగ్ ఈ-చలానాలకు ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
గతంలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ల ద్వారా లక్షలాది కేసులు పరిష్కారమయ్యాయి. అయితే ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల పెండింగ్ బాకీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోర్టులపై పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడం, అలాగే వాహనదారులకు సులభంగా పరిష్కార మార్గం అందించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఆర్థిక శాఖ ఆమోదంతో అమల్లోకి వస్తున్న ఈ పథకం పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండనుంది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి రాయితీలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ చలానాలను త్వరగా క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.








