Narendra Modi: తనను, తన దివంగత తల్లిని లక్ష్యంగా చేసుకుని చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. తిట్లు, ద్వేషంతో సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేసిన ఆయన.. తప్పుదారి పట్టిన వారిని శిక్షించడం కంటే సరైన మార్గం చూపడమే సమాజం బాధ్యత అని అన్నారు. యువత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధాని మోడీ, జంతర్ మంతర్ వద్ద NEET (UG) పరీక్ష అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో తనపై, తన దివంగత తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనను ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు.
అయినప్పటికీ యువత తప్పులు చేయడం సహజమని, వారిని శిక్షించడం లేదా సమాజం నుంచి దూరం చేయడం సరైన పరిష్కారం కాదని అన్నారు. వారికి మారే అవకాశం ఇవ్వాలని, సమాజం కూడా వారిని అర్థం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మోడీ ఒక ఉదాహరణతో తన సందేశాన్ని వివరించారు. “కొన్నిసార్లు నాలుక పళ్ల మధ్య ఇరుక్కుని గాయమైనా మనం పళ్లను విరగ్గొట్టం. ఎందుకంటే పళ్లు, నాలుక రెండూ మన శరీరంలోని భాగాలే. అలాగే తప్పు చేసిన ఈ యువత కూడా మన సమాజంలో భాగమే. వారిని సరైన దారిలో నడిపించడం మనందరి బాధ్యత” అని చెప్పారు. దేశం వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందని, యువత కూడా తమ జీవితాల్లో విజయపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
“మీ ఉజ్వల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నాను. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని కలిసి దేశాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్దాం” అని పిలుపునిచ్చారు.
ALSO READ: Commonwealth Games | కామన్వెల్త్లో భారత పతకాల పంట.. జూడోలో డబుల్ గోల్డ్








