Bhogapuram Airport: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) నాయకత్వాన్ని కొనియాడిన ఆయన, దేశాభివృద్ధిలో నరేంద్రుడి పాత్రను ప్రశంసిస్తూ విమర్శకులపై తీవ్రంగా స్పందించారు. “పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి” అంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్ కల్యాణ్.. ఒకప్పుడు భారత్ తన గౌరవాన్ని కాపాడుకోవడానికి బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని, అలాంటి దేశాన్ని ప్రపంచ వేదికపై బలమైన స్థానంలో నిలబెట్టిన ఘనత మోడీదేనని అన్నారు.
ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సరిహద్దుల్లో విదేశీ శత్రువులు, దేశంలో అంతర్గత సవాళ్లను ఒకేసారి ఎదుర్కొంటూ మోడీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని పవన్ అన్నారు. జంతర్ మంతర్ వద్ద మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తనకు తీవ్ర ఆవేదన కలిగిందని, కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును ముందుకు నడిపించడం అసాధారణ బాధ్యత అని, అలాంటి కర్తవ్యాన్ని నిర్వర్తించడం మహోన్నత కార్యమని పవన్ వ్యాఖ్యానించారు.
దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే తాను ఎన్డీయే పొత్తు కోసం బలంగా కృషి చేశానని పవన్ వెల్లడించారు. మోడీని రాజకీయంగా ఓడించే వ్యక్తి ఈ దేశంలో లేడని, ఇకపై కూడా రాడని వ్యాఖ్యానించారు. ఎన్ని విమర్శలు వచ్చినా లక్ష్యాన్ని మార్చుకోకుండా దేశ అభ్యున్నతికే అంకితభావంతో పనిచేసే నాయకుడు మోడీ అని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. దేశాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా తీసుకెళ్లే శక్తి ఆయనకు ఉందని వ్యాఖ్యానించారు. 25 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులు దేశం కోసం అంకితభావంతో పనిచేసే నాయకుల విలువను తమ పిల్లలకు తెలియజేయాలని సూచించారు. ప్రసంగం ముగింపులో ప్రధాని మోడీకి తన గౌరవాన్ని తెలియజేస్తూ, ప్రజలు వద్దనుకునే వరకు ఆయన నాయకత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.








