Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్కు మరో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM MODI) శనివారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram International Airport) టెర్మినల్ భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. సుమారు రూ.4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా నిలవనుంది.
టెర్మినల్ ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ విమానాశ్రయంలోని ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. చెక్-ఇన్ హాల్, ప్రయాణికుల సేవలు, టెర్మినల్ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. అలాగే ఎయిర్పోర్టు మాస్టర్ ప్లాన్, భవిష్యత్లో అభివృద్ధి చేయనున్న ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను కూడా ప్రధాని పరిశీలించారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని జాతీయ, అంతర్జాతీయ విమాన రవాణా నెట్వర్క్తో మరింత అనుసంధానం చేయనుంది.
భోగాపురం పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రూ.17,912 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సభా ప్రాంగణానికి ఓపెన్టాప్ జీపులో చేరనున్న ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపు తీసుకురానుందని ప్రభుత్వం భావిస్తోంది.
ALSO READ: Narendra Modi | ‘తిట్లతో సమస్యలు పరిష్కారం కావు’.. యువతకు ప్రధాని మోడీ భావోద్వేగ సందేశం








